ఈ-కేవైసీ, పేరు మార్పు కోసం ప్రజలపై భారం
రోజుకు 50 మంది పరిమితిని తొలగించి అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ డిమాండ్
వికారాబాద్, జూలై 31 (AYUSH24 NEWS ప్రతినిధి):
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం పక్కన ఉన్న మీసేవ–ఆధార్ కేంద్రంలో ఈ-కేవైసీ, పేరు మార్పు (నేమ్ చేంజ్) తదితర ఆధార్ సేవల కోసం రూ.150 చొప్పున వసూలు చేస్తున్నారని, అలాగే రోజుకు కేవలం 50 మందికి మాత్రమే టోకెన్లు జారీ చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ ఆరోపించారు.
శుక్రవారం కూడా 50 మంది పరిమితి పూర్తయిందని కేంద్రాన్ని మూసివేయడంతో, ఉదయం నుంచే వేచి ఉన్న వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, విద్యార్థులు, కార్మికులు సేవలు పొందకుండా వెనుదిరగాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆర్. మహిపాల్ మాట్లాడుతూ, ఆధార్ సేవల కోసం ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని, రోజుకు 50 మంది అనే నిబంధనను వెంటనే రద్దు చేసి, ఎక్కువ మందికి సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వికారాబాద్ జిల్లాలో అదనపు ఆధార్ నమోదు, అప్డేట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఈ-కేవైసీ, పేరు మార్పు తదితర సేవల గడువును ప్రభుత్వం పొడిగించాలని కోరారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజల తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
— AYUSH24 NEWS

