రూ.2 కోట్లతో నేరేడుగొమ్ము – కలకొండ తండా బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత – ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
నేరేడుగొమ్ము | AYUSH24 NEWS
దేవరకొండ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ అన్నారు.
నేరేడుగొమ్ము నుంచి కలకొండ తండా వరకు గిరిజన సంక్షేమ శాఖ నిధులు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు (బ్యాలెన్సింగ్ వర్క్) నిర్మాణ పనులకు సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఈ రోడ్డు పూర్తయితే నేరేడుగొమ్ము, కలకొండ తండా ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ముఖ్యంగా రైతులు తమ పంటలను పొలాల నుంచి మార్కెట్కు వేగంగా తరలించేందుకు ఈ రహదారి ఎంతో ఉపయోగపడుతుందని, రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు, గర్భిణీలు, వృద్ధులు, అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారు ఆసుపత్రులకు సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు.
గిరిజన తండాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రతి గ్రామం, ప్రతి తండా అభివృద్ధి చెందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు అవసరమైన ప్రతి మౌలిక వసతిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం తండా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించబడటంతో పాటు, ఆ ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కూడా ఇది ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి తండాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ పులికంటి సుధాకర్, మాజీ జడ్పీటీసీ కేతావత్ బాలు నాయక్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ బైరెడ్డి కొండల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు యుగేందర్ రెడ్డి, గిరి యాదయ్య, గడ్డం వెంకటయ్య, పరిసర గ్రామాల సర్పంచులు కొప్పుల సురేందర్ రెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ ఎలిజర్ల శ్రీను, వార్డు సభ్యులు, రామావత్ మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, యువకులు, తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.
— AYUSH24 NEWS

