కీర్తిశేషులు లోకసాని మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం కళావేదిక నిర్మాణం
మనం మనబడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పడమటపల్లి జడ్పీహెచ్ఎస్లో నిర్మాణం
రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించిన లోకసాని శ్రీనివాస్ రెడ్డి
పాఠశాల అభివృద్ధికి మనం మనబడి ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం
దేవరకొండ, ఆగస్టు 10 | ఆయుష్24 న్యూస్పడమటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి మనం మనబడి ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు ప్రశంసించారు. ఫౌండేషన్ నిర్మాణ సారథ్యంలో కొమ్మేపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు లోకసాని మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు లోకసాని శ్రీనివాస్ రెడ్డి అందించిన రూ.2 లక్షల ఆర్థిక సహాయంతో పాఠశాలలో కళావేదికను నిర్మిస్తున్నారు.ఈ కళావేదికను ఆగస్టు 15న నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు మనం మనబడి ఫౌండేషన్ పడమటపల్లి అధ్యక్షులు సూరేపల్లి వెంకట్, కోశాధికారి లయన్ నల్లమాద నారాయణరెడ్డి తెలిపారు.సోమవారం ఫౌండేషన్ ప్రతినిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోశాధికారి నల్లమాద నారాయణరెడ్డి చొరవతో అమెరికాలో స్థిరపడిన లోకసాని శ్రీనివాస్ రెడ్డిని సంప్రదించగా, తన తండ్రి లోకసాని మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం పాఠశాలలో కళావేదిక నిర్మించేందుకు ఆయన ముందుకు వచ్చారని తెలిపారు.పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులను ఏకతాటిపైకి తీసుకువస్తూ, వారి సహకారంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని మనం మనబడి ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.విద్యార్థుల్లోని సాంస్కృతిక ప్రతిభను వెలికితీయడంతో పాటు పాఠశాల కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, సభలు నిర్వహించేందుకు ఈ కళావేదిక ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.కీర్తిశేషులు లోకసాని మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా కళావేదిక నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన లోకసాని శ్రీనివాస్ రెడ్డిని మనం మనబడి ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలో మనం మనబడి ఫౌండేషన్ అధ్యక్షులు సూరేపల్లి వెంకట్, కోశాధికారి లయన్ నల్లమాద నారాయణరెడ్డి, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు చిన్న నాయక్, స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్) మనోహర్, మసన శివ తదితరులు పాల్గొన్నారు.

