మహిళల ఆర్థిక సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం – గౌరీకుంట తండా, గుడితండాలో మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గారు
కొండమల్లేపల్లి మండలంలోని గౌరీకుంట తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన 10 లక్షల రూపాయలతో మహిళా సమాఖ్య భవనాన్ని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు సంబంధిత అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం అదే మండలంలోని గుడితండా గ్రామంలో మరో 10 లక్షల రూపాయలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని కూడా ఆయన ప్రారంభించి మహిళా సంఘాల సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ గారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక అభివృద్ధికి మహిళా సంఘాలు కీలక శక్తిగా నిలుస్తున్నాయని అన్నారు. మహిళా సమాఖ్యలకు శాశ్వత కార్యాలయం ఉండటం వల్ల సమావేశాలు, పొదుపు–రుణాల నిర్వహణ, లెక్కల నిర్వహణ, శిక్షణా కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సులు, స్వయం ఉపాధి కార్యక్రమాల ప్రణాళికలు ఒకే చోట నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ భవనాలు మహిళల ఐక్యతకు, గ్రామాభివృద్ధిలో వారి భాగస్వామ్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, వడ్డీ భారం తగ్గింపు, బ్యాంకు అనుసంధాన రుణాల కల్పన, ఉపాధి శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా మరింత బలపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.అలాగే మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు, సంఘాల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ద్వారా మహిళా సంఘాలకు అందించే బస్సును త్వరలోనే మంజూరు చేయించేలా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మహిళలు ఆ బస్సును ఉపాధి, శిక్షణ, మార్కెటింగ్ మరియు ఇతర సామూహిక కార్యక్రమాలకు వినియోగించుకొని మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.AYUSH24 NEWSప్రజల గొంతుక – నిజమైన వార్తలకు విశ్వసనీయ వేదిక

