నేరేడుగొమ్ము గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల అభివృద్ధికి రూ.88.35 లక్షలతో శంకుస్థాపన
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది – ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

నేరేడుగొమ్ము | AYUSH24 NEWS
నేరేడుగొమ్ము మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ నిధులు రూ.88.35 లక్షల వ్యయంతో చేపట్టనున్న కాంపౌండ్ వాల్, ప్రత్యేక మరమ్మత్తులు, టాయిలెట్ బ్లాక్ నిర్మాణ పనులకు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ సంబంధిత అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గిరిజన విద్యార్థినులు మెరుగైన విద్యతో పాటు అన్ని వసతులతో విద్యాభ్యాసం కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నేరేడుగొమ్ము గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలకు మరిన్ని నిధులు మంజూరు చేయించి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నూతన ఊపు వచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, కొత్త భవనాల నిర్మాణం, మరమ్మత్తులు, పరిశుభ్రత, భద్రత వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను పెంచి, విద్యార్థులకు మెరుగైన ఆహారం, అవసరమైన వస్తువులు అందేలా చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ చర్యలతో విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావం పడుతోందన్నారు.
అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ విద్యను మరింత నాణ్యమైన స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు అందించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకురావడానికి తాను కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల సిబ్బందితో పాటు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ పులికంటి సుధాకర్, మాజీ జడ్పీటీసీ కేతావత్ బాలు నాయక్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ బైరెడ్డి కొండల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు యుగేందర్ రెడ్డి, గిరి యాదయ్య, గడ్డం వెంకటయ్య, సోమాని నాయక్, పరిసర గ్రామాల సర్పంచులు కొప్పుల సురేందర్ రెడ్డి, హేమ్లా నాయక్, ఉప సర్పంచ్ ఎలిజర్ల శ్రీను, ఇతర ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, రామావత్ మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, యువకులు, తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.
— AYUSH24 NEWS

