Breaking News
మారు మూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం

మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మిస్తాం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఆగస్టు 4న మరో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహణ

మహదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జూలై 31 (AYUSH24 NEWS ప్రతినిధి):

మారు మూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో ఐడీబీఐ బ్యాంకు సహకారంతో ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి, హైదరాబాద్ మరియు ఓమెగా ఆసుపత్రి, కరీంనగర్ వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్, కంటి నిర్ధారణ వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యంగా మహిళలను సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా పేద కుటుంబాలు ఆర్థికంగా నష్టపోకుండా కాపాడవచ్చని పేర్కొన్నారు.

ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు హెల్త్ ఏటీఎం, పెరిమీటర్, ఈసీజీ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. హెల్త్ ఏటీఎం ద్వారా 64 రకాల వైద్య పరీక్షలు వేగంగా నిర్వహించవచ్చని, పరీక్షల వివరాలు ఐదేళ్ల వరకు భద్రంగా ఉండే విధంగా హెల్త్ కార్డు అందజేస్తామని వివరించారు. కంటి పరీక్షల కోసం ప్రత్యేక పరికరాలు, గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు ఈసీజీ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం, విద్య రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలు అందేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మించి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రజల సౌకర్యార్థం ఆగస్టు 4న ఎంఎన్‌జే ఆసుపత్రి ఆధ్వర్యంలో మరో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను శిబిరాలకు తీసుకురావాలని సూచించారు.

ఇప్పటివరకు కాటారం డివిజన్ పరిధిలో 680 మందికి హైదరాబాద్‌లో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి చూపు ప్రసాదించామని, అలాగే మంథని నియోజకవర్గంలో 45 వేల మందికి కంటి చికిత్సలు అందించినట్లు మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజోపయోగ ఆరోగ్య కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు.

అనంతరం మంత్రి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య పరికరాలను పరిశీలించి, వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. మధుసూదన్, ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. శ్రీకాంత్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, ఆర్డీఓ రవీందర్, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ రవీంద్రనాథ్, అంకాలజిస్టు డా. సంతోష్ రెడ్డి, సర్పంచ్ హసీనా భాను అక్బర్, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఐడీబీఐ మేనేజర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, కాళేశ్వరం దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

— AYUSH24 NEWS

“THE VOICE OF TRUTH”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *