Breaking News
రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – బీజేపీ నేత చంద్రుపట్ల సునీల్ రెడ్డి

మంథని | రామగిరి మండలం

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలపై రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి రామగిరి మండలంలోని జేఎన్‌టీయూ కళాశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బీజేపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, “వన్ టైమ్ సెటిల్‌మెంట్” పేరుతో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు.

ఫీజులు చెల్లించకపోవడంతో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బకాయిల కారణంగా సర్టిఫికెట్లు నిలిచిపోవడంతో ఉద్యోగాలు, ఉన్నత విద్య అవకాశాలను కోల్పోతున్నారని పేర్కొన్నారు. అలాగే సకాలంలో స్కాలర్‌షిప్‌లు అందక విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

బీజేపీ ప్రధాన డిమాండ్లు:

  • రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
  • ఫీజు బకాయిల కారణంగా నిలిచిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్లను తక్షణమే విడుదల చేయాలి.
  • 40 లక్షల మంది విద్యార్థుల చదువులు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతినకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి.
  • ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు అత్యవసర ఆర్థిక ఉపశమనం కల్పించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ మండలాల బీజేపీ అధ్యక్షులు, బీజేవైఎం నాయకులు, సీనియర్ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS
“ప్రజల గొంతుక – నిజమైన వార్తల వేదిక”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *