Breaking News
అనుమతులు లేని ‘ఎస్‌పీఆర్ హైస్కూల్’, అక్రమ హాస్టల్‌ను తక్షణమే సీజ్ చేయాలి: ఎంఈఓకు విద్యార్థి, ప్రజా సంఘాల వినతి

హైకోర్టు, విద్యాశాఖ ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ – అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

AYUSH24 NEWS | కొండమల్లేపల్లి | 04-08-2026

కొండమల్లేపల్లిలో అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఎస్‌పీఆర్ హైస్కూల్’ మరియు అనుమతి లేని రెసిడెన్షియల్ హాస్టల్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు మంగళవారం మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ)కు వినతిపత్రం సమర్పించారు.

రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (RTISS) ఫౌండర్, నేషనల్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురామ్ నాయక్ ఆధ్వర్యంలో టి.ఎన్.ఎస్.ఎఫ్. దేవరకొండ ఇన్‌ఛార్జ్ జార్పుల జగన్ నాయక్, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎండి. సిరాజ్, ఎస్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. రమేష్ నాయక్, ఎన్‌ఎస్‌యూఐ నేషనల్ కో-ఆర్డినేటర్ పి. శ్రీకాంత్తో పాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు ఈ వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ హైకోర్టు, కమర్షియల్ కోర్టు, ప్రాంతీయ విద్యా సంచాలకుల (RJDSE) ఉత్తర్వుల ప్రకారం ‘ఎస్‌పీఆర్ హైస్కూల్’ పేరును వినియోగించరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, యాజమాన్యం చట్టవిరుద్ధంగా తరగతులు, అడ్మిషన్లు నిర్వహిస్తోందని ఆరోపించారు.

అలాగే, ప్రభుత్వ అనుమతులు, ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ లేకుండా రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వహించడం వల్ల విద్యార్థుల భద్రత ప్రమాదంలో పడుతోందని పేర్కొన్నారు. పాఠశాల భవనం చెరువు ఎఫ్‌టీఎల్ (Full Tank Level) / బఫర్ జోన్ పరిధిలో ఉందని, దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో కలిసి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం (RTE Act-2009), తెలంగాణ విద్యా చట్టం-1982 నిబంధనల ప్రకారం గుర్తింపు లేని పాఠశాల నిర్వహణపై జరిమానాలు విధించడంతో పాటు, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అక్రమ పాఠశాల, హాస్టల్‌ను సీజ్ చేసి పూర్తి నివేదికను జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ)కు పంపించాలని ఎంఈఓను కోరారు.

ఈ కార్యక్రమంలో కేతావత్ బాబురామ్ నాయక్, జార్పుల జగన్ నాయక్, ఎండి. సిరాజ్, కె. రమేష్ నాయక్, పి. శ్రీకాంత్, బి. వెంకటేష్, కె. నరేష్, వి. ఆంజనేయులు, రామ్‌దాస్, రాజు నాయక్తో పాటు వివిధ విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *