దేవరకొండలో కొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాలు
దేవరకొండ | AYUSH24 NEWS
దేవరకొండ పట్టణంలోని 12వ వార్డు అయ్యప్ప నగర్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ వినోద మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు (కొలస్ట్రం) తప్పనిసరిగా పట్టించాలని సూచించారు. అలాగే తల్లి–బిడ్డ మధ్య స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కల్పించడం వల్ల బిడ్డ ఆరోగ్యవంతంగా ఎదగడంతో పాటు తల్లితో బలమైన అనుబంధం ఏర్పడుతుందని తెలిపారు.
ముర్రుపాల వల్ల బిడ్డకు వ్యాధినిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయని, పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని చెప్పారు. ఈ కాలంలో తేనె, గ్లూకోజ్ వాటర్ లేదా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వకూడదని అవగాహన కల్పించారు.
అదేవిధంగా తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని వివరించారు. కుటుంబ సభ్యులు తల్లి ప్రశాంత వాతావరణంలో బిడ్డకు పాలిచ్చేలా సహకరించాలని సూచించారు.
ఇంకా గర్భధారణ 9వ నెలలో ఉన్న గర్భిణుల ఇళ్లను సందర్శించి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
– AYUSH24 NEWS
“The Voice of Truth”

