Breaking News
టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయానికి ఇష్టానుసారంగా తాళం.. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం

కార్యాలయ సమయాల్లో సేవలు లేక ప్రజలకు ఇబ్బందులు.. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్

AYUSH24 NEWS | టేకులపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం నిర్ణీత కార్యాలయ సమయాల్లో తెరవకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ ఇష్టానుసారంగా కార్యాలయాన్ని తెరవడం, మూసివేయడం జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమయంలో తాళం వేసి ఉండటంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పన్నుల చెల్లింపులు, సంక్షేమ పథకాల దరఖాస్తులు, ఇతర ప్రజా సేవల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

మాకు నచ్చినప్పుడే కార్యాలయం తెరుస్తాం.. మాకు నచ్చినప్పుడే తాళం వేస్తాం” అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయాల్లో కార్యాలయం పనిచేసి ప్రజలకు సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి (DPO), ఎంపీడీఓతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి, గ్రామపంచాయతీ కార్యాలయం నిర్ణీత సమయాల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *