ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఆదర్శం
ప్రధానోపాధ్యాయులు చేరిపల్లి శ్రీనివాసులు పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ, జూలై 31 (AYUSH24 NEWS):
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ పొందిన శ్రీ చేరిపల్లి శ్రీనివాసులు గారి సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సుదీర్ఘ సేవా కాలంలో వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో శ్రీనివాసులు గారు విశేష కృషి చేశారని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, భావితరాలను నిర్మించే గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు.
దేవరకొండ జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల పెంపుకు, ఉపాధ్యాయుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడానికి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.

పదవీ విరమణ పొందిన శ్రీ చేరిపల్లి శ్రీనివాసులు గారికి, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పదవీ విరమణ అనంతరం కూడా తన అనుభవంతో సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ-వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, దేవరకొండ చేనేత సహకార సంఘం అధ్యక్షులు చేరిపల్లి బాలరాజు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
— AYUSH24 NEWS

