వార్డు సమస్యలు అడిగితే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు” – ముగ్గురు వార్డు సభ్యుల ఆరోపణలు
కొండమల్లేపల్లి, ఆగస్టు 9 – అయుష్24 న్యూస్:నల్లగొండ జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీ కొండమల్లేపల్లిలో సర్పంచ్, కొంతమంది వార్డు సభ్యుల మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. గ్రామ అభివృద్ధి, వార్డు సమస్యలు, పంచాయతీ నిధుల వినియోగం తదితర అంశాలపై సర్పంచ్ను ప్రశ్నిస్తున్న తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఒకటి, రెండు, తొమ్మిదో వార్డు సభ్యులు ఆరోపించారు.ప్రజలు తమపై నమ్మకంతో ఓట్లు వేసి వార్డు సభ్యులుగా ఎన్నుకున్నారని, అదే ప్రజలు గ్రామ సర్పంచ్ను కూడా ఎన్నుకున్నారని వారు గుర్తుచేశారు. అందువల్ల రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలకు అతీతంగా అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు.“వార్డు సమస్యలు చెబితే సిబ్బందికి ఆదేశాలు”శనివారం కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఒకటి, రెండు, తొమ్మిదో వార్డు సభ్యులు బూడిద మంజుల మల్లేష్ యాదవ్, ఎలిమినేటి సాయి, బొడిగ శంకర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలను వివరించారు.వార్డుల్లో పారిశుద్ధ్యం, బ్లీచింగ్, ఫాగింగ్, విద్యుత్ దీపాలు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు తదితర అంశాలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు.తాము కేవలం ప్రజా సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్తున్నామని, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో తమ హక్కు అని అన్నారు. అయితే తాము చెప్పిన పనులను సిబ్బంది చేపట్టేందుకు సర్పంచ్ అనుమతి తప్పనిసరి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.“మేమూ ప్రజల ఓట్లతోనే గెలిచాం”తమలో ఒక వార్డు సభ్యుడు మూడుసార్లు, మరొకరు రెండుసార్లు ప్రజల ఆశీర్వాదంతో గెలిచారని వారు తెలిపారు. సంవత్సరాలుగా ప్రజల మధ్య పనిచేస్తున్న వార్డు సభ్యులకు కనీస మర్యాద, గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.సర్పంచ్కు ప్రశ్నలు అడిగినందుకు తమను పక్కన పెడుతున్నారని, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. గ్రామపంచాయతీలోని అన్ని వార్డులకు సమానంగా సేవలు అందించాల్సిన బాధ్యత సర్పంచ్పై ఉందన్నారు.పంచాయతీ నిధులపై ఆరోపణలుగ్రామపంచాయతీకి గణనీయమైన ఆదాయ వనరులు ఉన్నాయని, నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని వార్డు సభ్యులు డిమాండ్ చేశారు.పంచాయతీ నిధులకు సంబంధించి సుమారు రూ.90 లక్షలు ప్రైవేట్ ఖాతాలోకి మళ్లించారనే ఆరోపణలు తమకు ఉన్నాయని, దీనిపై ఆధారాలు సేకరిస్తున్నామని రెండో వార్డు సభ్యుడు ఎలిమినేటి సాయి తెలిపారు.అయితే ఈ ఆరోపణలకు సంబంధించి సంబంధిత సర్పంచ్ లేదా గ్రామపంచాయతీ అధికారుల అధికారిక వివరణ ఈ సమావేశంలో తమకు అందలేదని వారు పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి వాస్తవాలు అధికారిక రికార్డులు, సంబంధిత అధికారుల వివరణ ద్వారా తేలాల్సి ఉంది.9వ వార్డు సభ్యుడు బొడిగ శంకర్ గౌడ్ ఆవేదన9వ వార్డు సభ్యుడు బొడిగ శంకర్ గౌడ్ మాట్లాడుతూ తాను ప్రజల ఆశీర్వాదంతో రెండోసారి వార్డు సభ్యుడిగా గెలిచానన్నారు.తన వార్డులో వాటర్ ట్యాంక్ ఏర్పాటు, విద్యుత్ దీపాలు, డ్రైనేజీ శుభ్రత వంటి సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు.గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశంలో వార్డు పనులపై ప్రశ్నించినప్పుడు తనకు సరైన సమాధానం ఇవ్వలేదని, దీంతో తాను తీవ్రంగా ఆవేదనకు గురయ్యానన్నారు.తమపై ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. శనివారం తమ సొంత నిధులతో ఒకటి, రెండు, తొమ్మిదో వార్డుల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.సంత టెండర్పై కూడా ప్రశ్నలుకొండమల్లేపల్లి పశువుల సంత టెండర్ విషయంలో కూడా వార్డు సభ్యులు పలు ఆరోపణలు చేశారు.ప్రస్తుతం సంత రీటెండర్లో సుమారు రూ.3.80 కోట్లకు పైగా వేలం జరిగినట్లు, భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి టెండర్ దక్కించుకున్నట్లు తెలిపారు. టెండర్కు సంబంధించిన చెల్లింపులు, వాయిదాల విషయంలో స్పష్టత లేదని వారు ఆరోపించారు.గతంలో సంత కాంట్రాక్టర్కు సంబంధించిన చలాన్ల విషయంలో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయని, అలాంటి పరిస్థితులు మళ్లీ జరగకుండా పంచాయతీ నిధులు, ఆదాయాల విషయంలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు.“ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారు”తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్ తమను కలుపుకొని ముందుకు వెళ్లాలని ముగ్గురు వార్డు సభ్యులు కోరారు.సర్పంచ్ కూడా ప్రజల ఓట్లతోనే ఎన్నికయ్యారని, తాము కూడా ప్రజల ఓట్లతోనే వార్డు సభ్యులుగా ఎన్నికయ్యామని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం పాలకవర్గం అంతా కలిసి పనిచేయాలని సూచించారు.“మల్లేపల్లి ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. భవిష్యత్తులో ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారు” అని వార్డు సభ్యులు పేర్కొన్నారు.ఈ ఆరోపణలపై సర్పంచ్ పసునూరి యుగేందర్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు సంబంధిత అధికారులు అధికారికంగా స్పందిస్తే వారి వివరణను కూడా ప్రచురించేందుకు ఆయుష్24 న్యూస్ సిద్ధంగా ఉంది.
– కొండమల్లేపల్లి అయుష్24 న్యూస్